మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులు శివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. అలాగే రోజంతా ఉపవాసం ఉంటూ..శివారాధనలో గడుపుతుంటారు. ఇక రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగారణ చేస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు, అలాగని ఏ పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా శివయ్య ఏమి అనుకోడు..ఓ చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా ఇట్టే కరుణిస్తాడు..అలాగే పంచ భక్ష పరమాన్నాలు ప్రసాదంగా పెట్టకపోయినా శివయ్య చిన్నబుచ్చకోడు..ఓ అరటి పండు పెట్టినా మహదానందంగా తీసుకుని కరుణిస్తాడు. ఇక శివరాత్రి రోజున రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు చెబుతోంది. అసలేం తినకుండా చేస్తే పరమశివుడి మీద మనసు లగ్నం కాదు..కావున ఉపవాసం చేసేవాళ్లు పాలు, పండ్లు మితంగా తీసుకోవచ్చు..అలాగని ఎక్కువగా లాగించేయద్దు సుమా…
ఇక మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదంటారు. ఇక మహాశివరాత్రి నాడు చేసే జాగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటమే జాగారం. ఇలా చేసిన వారికి మళ్లీ పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని కొందరు కబుర్లు చెప్పుకుంటూ, లేదా టీవీల్లో ప్రోగ్రామ్స్, లేదా సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తారు..అలా చేయడం చాలా తప్పు.. శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ జాగారం చేస్తే ఫలితం ఉంటుంది. కొందరు తెల్లవారుజామునే నిద్రపోతారు..అలా చేయడం మహాపాపం…పొద్దున్నే మళ్లీ తలస్నానం చేసి ఆలయానికి వెళ్లి పరమశివుడిని పూజించి, నైవేద్యంగా పెట్టిన తర్వాతే ఆహారాన్ని స్వీకరించాలి..చూశారుగా మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఈవిధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పరమశివుడు..మీకు సకల శుభాలు కలుగజేస్తాడు..ఓం నమశివాయః