కర్నూలు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా ఆ పార్టీని కుదిపేస్తోంది. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి డోన్లో మున్సిపల్ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటోందని ప్రకటించారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా కుదేలైంది. చాలా చోట్ల ఇన్చార్జ్ల మద్దతు లేక ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. దశాబ్దాలుగా కర్నూలు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేఈ సోదరుల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేయడం, మరొకరు మున్సిపల్ ఎన్నికల్లో చేతులెత్తేయడంతో ఇక తమ పరిస్థితి ఏంటని జిల్లాలో నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జ్లు అయోమయంలో పడ్డారు. జిల్లాలో ఇక టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబును నమ్ముకుని నట్టేటా మునడం కంటే రాజకీయ భవిష్యత్తు కోసం వేరే పార్టీలో చేరడం మేలని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్నారు.
కాగా రాజీనామాపై కేఈ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒంటెత్తు పోకడలతోనే తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. పార్టీ సరైన దారిలో నడవలేదన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్టీకి ద్రోహం చేసి టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారని, అలాంటి వ్యక్తి కనుసన్నల్లో ఇప్పటికీ టీడీపీ నడుస్తోందని కేఈ ప్రభాకర్ ఆరోపించారు. కార్పొరేటర్ టిక్కెట్ల నుంచి జిల్లాలోని చాలా నియోజవకర్గాల్లో టీడీపీలో టీజీ మాట చెల్లబాటవుతోందన్నారు. అలాగే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారని, కానీ నంద్యాల పార్లమెంట్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని కేఈ ప్రభాకర్ మండిపడ్డారు. ఈ విషయాలు అధిష్టానికి తెలిపినా నిర్లక్ష్యం చేసి, వారికే సహకరిస్తున్నారన్నారు. వీటితో పాటు చాలా కారణాలు ఉన్నాయని, అందుకే టీడీపీని వీడుతున్నాని తెలిపారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు.
అయితే కేఈ ప్రభాకర్ రాజీనామా విషయం తనకు తెలియదని కేఈ కృష్ణమూర్తి అన్నారు.చంద్రబాబు తీరుపై పెద్దాయన కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కేఈ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం, రెవిన్యూ మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు అధికారాలు లేకుండా చేశాడు చంద్రబాబు. ఆఖరకి ఒక ఎమ్మార్వోను బదిలీ చేసే ఛాన్స్ కూడా చంద్రబాబు ఇవ్వలేదని కేఈ గతంలో వాపోయారు. అంతే కాదు జిల్లాలో రాజకీయాల్లో సీనియర్ అయిన తనకంటే వయసులో ఎంత చిన్నదైనా భూమా అఖిలప్రియకు బాబు, లోకేష్లు ప్రియారిటీ ఇవ్వడం కేఈ కృష్ణమూర్తిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. ఇక మూడు రాజధానుల విషయంలో కూడా కేఈ సోదరులు తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని భావిస్తున్నారు. ఇప్పుడు కేఈ ప్రభాకర్ రాజీనామాతో త్వరలోనే కేఈ కృష్ణమూర్తి , ఆయన కుమారుడు కేఈ శ్యామ్బాబులు కూడా టీడీపీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కర్నూలు జిల్లాలో చర్చ జరుగుతోంది. మొత్తంగా కేఈ కుటుంబం రాజీనామా చేస్తే కర్నూలు జిల్లాలో టీడీపీ కథ సమాప్తం అనే చెప్పాలి.