శిశుపాలుడిలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద తప్పులకు దగ్గరగా వచ్చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైసీపీ పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇకనైనా చిత్తశుద్దితో వ్యవహరించాలని, లేకుంటే భావి తరాలు క్షమించవని వైఎస్ జగన్ అన్నారు.
కాగా, మంగళవారం నాడు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వద్ద వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు తారా స్థాయికి చేరాయన్నారు. అటువంటి చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. సీఎం చంద్రబాబు దగ్గరుండి మరీ ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా రావడం లేదంటే అందుకు కారణం.. చంద్రబాబు అడగాల్సి.. ఉద్యమించాల్సిన సమయంలో చేయకపోవడమే ఇందుకు కారణమని జగన్ పేర్కొన్నారు.