అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, కరడు గట్టిన నేరస్థుడిలా పోలీసుల కళ్లు గప్పి పారిపోయి, 14 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్రాసిటీ కేసుతో పాటు దాదాపు 50 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేని కోసం పోలీసులు 12 స్పెషల్ టీమ్లను రంగంలోకి దింపి వెదికారు. అయితే ఇవాళ దుగ్గిరాలలో తన భార్యను చూడటానికి వచ్చిన చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు త్రీ టౌన్కు తరలించారు. కాగా అరెస్ట్ అనంతరం చింతమనేని మీడియాతో మాట్లాడుతూ…పోలీసులపై విరుచుకుపడ్డాడు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, సోదాల పేరుతో తన ఇంటిని ధ్వంసం చేశారని, తన కుటుంబ సభ్యులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డాడు. పోలీసులు తనను రెచ్చగొడుతున్నారని, అయితే కేసులకు భయపడేది లేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని చింతమనేని చిందులు వేశాడు. అయినా పోలీసులకు తానే లొంగిపోయానని, కానీ వాళ్లు మాత్రం తనను పట్టుకున్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ చింతమనేని చెప్పుకొచ్చాడు. తనను పట్టుకునేందుకు 12 పోలీస్ టీమ్ను దింపారని, అయినా 14 రోజుల పాటు పట్టుకోలేకపోయారంటూ చింతమనేని పోలీసులను ఎద్దేవా చేశాడు. చింతమనేని వ్యాఖ్యలపై దెందులూరు ప్రజలు విస్తుపోతున్నారు. అధికారంలోకి ఉండగా చింతమనేని అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోయింది. చంద్రబాబు, లోకేష్ల అండతో చింతమనేని జిల్లాలో చెలరేగిపోయాడు. ఇసుక మాఫియాను అడ్డుకున్న పాపానికి ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టిన ఘనుడు ఈ చింతమనేని. తనను ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం ఈయనగారి నైజం. గత ఐదేళ్లు దెందులూరులో చింతమనేని, ఆయన అనుచరుల దౌర్జన్యాలకు, కబ్జాలకు బలైపోయిన అమాయకులు ఎందరో. అలాంటి చింతమనేనిపై 50 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో చాలా కేసుల్లో ఆధారాలు బలంగా ఉన్నాయి. దీంతో చింతమనేని జైలుకు వెళ్లడం ఖాయమని దెందులూరు ప్రజలు అంటున్నారు. అయినా ఒక నేరస్థుడిలా పారిపోయిన చింతమనేని..12 పోలీస్ టీమ్లు వెదికినా నన్ను పట్టుకోలేకపోయారంటూ ఎద్దేవా చేయడం చూసి, వార్నీ చింత చచ్చినా పులుపు చావలేదా చింతమనేని..నీకు చిప్పకూడు పక్కా అంటూ దెందులూరు ప్రజలు అంటున్నారు.