ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు ఉదయం అనుమానస్పద స్థితిలో మరణించారు. కోడెల మరణం పట్ల సీఎం జగన్తో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పార్టీలకతీతంగా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం కోడెల మృతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో చెప్పినట్లు వెస్ట్జోన్ డీసీపీ తెలిపారు. కాగా పోస్ట్ మార్టం నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లో పోస్ట్మార్టం జరుగనుంది. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత కోడెల ఎలా మరణించారనే విషయంపై క్లారిటీ వస్తుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి వేధింంచడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ..తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వ చీప్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా గడికోట మాట్లాడుతూ..కోడెల మృతి దురదృష్టకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడద్దని టీడీపీ నేతలకు హితవు పలికారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయ చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు. సీనియర్ నేత చనిపోయారు అనే బాధలేకుండా టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారంటూ గడికోట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కోడెల మరణించాడన్న వార్త వచ్చిన మరుక్షణం నుంచి టీడీపీ నేతలు రాజకీయం మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించడం వల్లే..కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఎల్లోమీడియా ఛానళ్లతో సహా, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి ఆ కేసులు రాజకీయ కేసులు కావు..గత ఐదేళ్లలో కోడెల ఫ్యామిలీ అవినీతి, ఆగడాలకు బలైపోయిన బాధితులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యంగా బయటకు వచ్చి పెట్టిన కేసులు. ఇందులో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారితో పెట్టించిన దాఖలా లేదు. అయినా ఒక సీనియర్ నేత చనిపోయిన బాధ కూడా లేకుండా…టీడీపీ నేతలు ఆయన మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు. అందుకే కోడెల మరణం విషయంలో వైసీపీ సంయమనం పాటించినా..టీడీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేస్తుండడంతో ప్రభుత్వం తరపున చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది. కోడెల వంటి సీనియర్ నేత చనిపోతే..ఏ మాత్రం బాధ లేకుండా…ఇలా వైసీపీపై దుమ్మెత్తిపోయడం ఏంటని టీడీపీ నేతలకు గడికోట గడ్డిపెట్టాల్సి వచ్చింది.