ఏపీ అసెంబ్లీలో ఉపాధి హామీ పనుల నిధులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని, బిల్లులను నిలిపివేస్తున్నారు..నిధుల విడుదల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఉపాధి పనులకు బకాయి నిధులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఆరోపణలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం ఇస్తూ.. ఉపాధి నిధుల విడుదల కోసం ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో తన గురించి అన్నీ తెలిసిన చంద్రబాబు కూడా ఇలా ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఉపాధి హామీ పనుల నిధులు దారి మళ్లించారని కేంద్రానికి చంద్రబాబు, టీడీపీ ఎంపీలు లేఖ రాశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని క్లియర్గా ఉన్నవాటికి బిల్లులు విడుదల చేస్తున్నామని పెద్దిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొత్తంగా చంద్రబాబు ఆరోపణలకు ప్రతిగా మంత్రి పెద్దిరెడ్డి విసిరిన సవాల్ ఏపీ రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది.