ఏపీకి మూడు రాజధానుల విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైవి…సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా…ఎల్లోమీడియాకు కనిపించడం లేదని తీవ్రంగా ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్ దళితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ…మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 6 నెలల్లోనే ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేశారని వైవీ పేర్కొన్నారు. దళితుల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క కార్యక్రమం అయినా చేశారా అని ఆయన ప్రశ్నించారు. పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో అంగ్ల విద్యను అమలు చేస్తున్న గొప్ప నేత సీఎం జగన్ అని వైవి కొనియాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేశారన్నారు.
కాగా.. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైవిసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, మరోక లక్ష కోట్లు తెచ్చి రాజధానిని నిర్మిస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదని, రాజధానిలో కనీసం రోడ్లు కూడా బాబు వేయలేదని ధ్వజమెత్తారు. ఇక అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే, రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం మోపకూడదనే ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మొత్తంగా మూడు రాజధానులపై చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని వైవి సుబ్బారెడ్డి తిప్పికొట్టారు.