తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన అమిత్ షాకు టీడీపీ శ్రేణులు నల్ల జెండాలతో స్వాగతం పలికారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు అంతటితో ఆగక అమిత్ షా స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో అమిత్ షాకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సంఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అడ్డుకుని బీజేపీ, టీడీపీ శ్రేణులను చెల్లాచెదురు చేశారు.
అయితే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రోద్భలంతోనే టీడీపీ శ్రేణులు అమిత్ కాన్వాయ్పై దాడి చేశారంటూ తిరుపతి అర్బన్ ఎస్పీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అమిత్ షా వస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు.. పథకం ప్రకారమే చంద్రబాబు పన్నాగంపన్ని తమ పార్టీ నేతలతో దాడి చేయించారని బీజేపీ నేతలు మీడియా ముఖంగా విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించి హోమంత్రిని వివరణ కోరగా.. అసలు అమిత్ షాపై రాళ్లదాడే జరగలేదంటూ విచిత్ర వివరణ ఇవ్వడం కొసమెరుపు.