రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కర్ణాటక నేతలతో దోస్తీ కట్టేశారు. కర్ణాటక నేతలతో ఆయనకు దోస్తీ ఇప్పుడు కొత్తేమీ కాదు. ఆయనతో దోస్తీ ఉండగానే కర్ణాటక నేతలతో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన సంగతి చంద్రబాబుకు గుర్తు లేకపోయినా తెలుగు ప్రజలు ఇంకా మరిచిపోలేదు. గతంలో కన్నడ నేత దేవగౌడను తానే ప్రధాన మంత్రిని చేశానని చెప్పుకునే చంద్రబాబు దేవగౌడ హయాంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సహజంగానే మరిచిపోయారు. అప్పట్లో దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండగానే కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానది నీళ్లు రానివ్వకుండా చేసిన చరిత్ర ప్రజలు మరిచిపోలేదు. అలా చంద్రబాబు చేసిన పాపం ఇప్పటికీ ఏపీ ప్రజలను వెంటాడుతూనే ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2015లో కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. విభజన పేరుతో ఏపీకి నిధులు కురిపిస్తే తమకు అన్యాయం జరుగుతుందని ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు బెంగళూరు నుంచి అమరావతికి తరలిపోయే ప్రమాదం ఉందని సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు మరిచిపోయినట్టు నటించి.. ఇప్పుడు కన్నడ కాంగ్రెస్ నేతల సరసన కూర్చుకునేందుకు తయారయ్యారు. ఇలా కన్నడ నేతల వల్ల రాష్ట్రానికి అన్యాయాలు జరిగినా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ మీడియా ముందు బుకాయిస్తూ కాంగ్రెస్కు జేజేలు పలకడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం.