ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఆరోగ్య శ్రీ వర్తించలేదంటూ సీఎం జగన్ కించపరుస్తూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఆ వీడియోలో ఆర్టిస్టులకు మేకప్ వేస్తున్న దృశ్యాలు కనపడడంతో టీడీపీ సోషల్ మీడియా టీమ్ బండారం బయటపడింది. ఆ వీడియోలో ఉన్న మహిళ ఎన్నికలకు ముందు టీడీపీ యాడ్స్లో నటించిన మహిళగా గుర్తించారు. ఇక ఆ తర్వాత ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల నేపథ్యంలో రైతు వేషంలో ఉన్న ఓ యువకుడు సీఎం జగన్ను.. ముఖ్యంగా మంత్రి అనిల్కుమార్ యాదవ్ను కులం పేరుతో దూషించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. దీంతో వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడిని గుంటూరు జిల్లాకు చెందిన శేఖర్ చౌదరిగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం నిందితుడు శేఖర్ చౌదరిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో శేఖర్ చౌదరి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివప్రసాద్, సీతారామయ్య, శివయ్య అనే మరో ముగ్గురు నటుల పేర్లను చెప్పినట్లు సమాచారం.. దాంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా టీడీపీ సోషల్ మీడియా టీమ్ చేయమన్నట్లే చేశాను. నాలాగే చాలా మంది ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పని చేస్తున్నారంటూ శేఖర్ చౌదరి పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా రైతు వేషంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను కులంపేరుతో దూషించిన కేసులో శేఖర్ చౌదరిని.. పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం వెనుక టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఈ కేసుపై కూలంకుశంగా విచారణ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ సోషల్ మీడియా లోకేష్ సారథ్యంలో నడుస్తోంది. దీంతో ఈ కేసులో లోకేష్ ప్రమేయంపై పూర్తి ఆధారాలను సేకరించిందేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. దీంతో ఈ కేసులో లోకేష్ పాత్ర బయటపడే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా మంత్రి అనిల్కుమార్ను కులం పేరుతో దూషించిన ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో…ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.
