ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ప్రముఖస్థానం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో సుమారు 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్స్టార్ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, యూత్ ఎఫైర్స్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. టూరిజంతోపాటు చారిత్రక ప్రాంతాల అభివృద్ధి, అన్ని జిల్లాల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.., భారతదేశంలో అడుగుపెట్టే ప్రతి పర్యాటకుడు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఎంపికచేసుకుంటున్నారని, అక్కడ పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండడమే దీనికి కారణమని అన్నారు.
రాష్ట్రంలో ఈ స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసిన తనకు వివరాలు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆతిథ్యరంగంలో, పర్యాటక రంగంలో అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతలున్న సంస్థలు హోటళ్లను ఏర్పాటు చేసేట్టు ఇక్కడ ఉత్తమ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై సహజంగానే అంతర్జాతీయస్థాయిలో మంచి ప్రచారం లభిస్తుందన్నారు. అభివృద్ధి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తర్వాత వాటి మార్కెటింగ్ చేయడంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. ఇదే సమయంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు. పూర్తిస్థాయి వివరాలతో తనకు మళ్లీ సమాచారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అక్కడ నదికి అడ్డంగా గ్లాస్తో ఒక వంతెన కూడా నిర్మించే ఆలోచన చేస్తున్నామని, పలు పర్యాటక ప్రాంతాల్లో రోప్వేలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు వివరించారు. తనకు సమర్పించే నివేదికలో ఈప్రతిపాదనలు అన్నింటినీ చేర్చాలని సీఎం సూచించారు. పోలవరం, పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర రిజర్వాయర్లు, డ్యాంలతోపాటు, విశాఖజిల్లాలో అరుకు, లంబసింగి, పాడేరు, మారేడుమిల్లి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
విశాఖలో మరో మ్యూజియం ఏర్పాటుకు రక్షణశాఖ అధికారులు సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సమావేశంలో వెల్లడించారు. ఏపీటీడీసీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో హోటళ్లను, రిసార్టులను నిర్వహిస్తోందని, అయితే చాలారోజులగా నిర్వహణకోసం కనీస నిధులు కూడా ఇవ్వకపోవడంతో సమస్యలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే వీటి మరమ్మత్తులు చేపట్టి, నిర్వహణ మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్న హస్తకళలు అంతరించిపోకుండా వారిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అరుదైన హస్తకళల్లో నైపుణ్యం కలిగిన ఏటికొప్పాక, కొండపల్లి, కంళంకారీ తదితర కళాకారులును ఆదుకునే దిశగా కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, లేసుల తయారీ, కళంకారీ తదితర అరుదైన హస్తకళలు చేస్తున్న కుటుంబాలవారికి సహాయం చేసేలా మార్గదర్శకాలు తయారుచేయాలన్నారు. లేకపోతే ఆ కళలు బతకవని, వాటిని నిలుపుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
అలాగే రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.గోదావరిలో బోట్లను తిప్పడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. నదీతీరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుపై ఈ సందర్భంగా సీఎం ఆరాతీశారు.నిర్దిష్టమైన నిర్వహణా పద్ధతులు, కంట్రోల్ రూమ్స్ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. పర్యాటకులు,ప్రయాణికులకు సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఏర్పాటైన కమిటీ నివేదిక రాగానే సిఫార్సులపై చర్చిద్దామని సీఎం చెప్పారు.
శిల్పారామాల్లో ప్రస్తుత పరిస్థితిపైనా సీఎం సమీక్ష చేశారు. ప్రస్తుతం ఉన్న శిల్పారామాల అభివృద్ధి, వాటిలో గ్రీనరీని పెంచడంపై సీఎం అధికారులకు సూచించారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బందిలేకుండా విధానాన్ని తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రతిజిల్లాలో కల్చరల్ అకాడమీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. కనీసం ఐదెకరాల స్థలంలో అకాడమీలను నిర్మించాలని, రెండేళ్లలోగా వీటిని పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్ అకాడమీలు వేదిక కావాలన్నారు. మన కళలను, సంస్కృతిని నిలుపుకోవడానికి, వాటి ప్రాముఖ్యత పెంచడానికి ఈ అకాడమీలు ఉపయోగపతాయని సీఎం అన్నారు. సంగీత, నృత్యకళాశాలలో బోధిస్తున్న వారికి పార్ట్టైం, ఫుల్టైం వారికి జీతాలు పెంచాలని సీఎం ఆదేశించారు.