రాయలసీమ ఆత్మీయ యాత్రలో హిందూ మతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మతాల మధ్య గొడవ పెట్టేది, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అంటూ దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల తిరుమల డిక్లరేషన్, అన్యమత ప్రచారం అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్ మరోసారి టీటీడీపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. టీటీడీలో అన్యమత ప్రచారం చేస్తుంది..హిందువులేనని, హిందూ నాయకుల కుట్ర లేనిదే ఇలాంటివి జరగవని అర్థంపర్థం లేని విమర్శలు చేశారు. దేశంలో సెక్యులరిజాన్ని ఇబ్బందిపెడుతోంది హిందువులు మాత్రమేనని, మిగతా మతాలవారు ఇలాంటి పనులు చేయరంటూ తనదైన స్టైల్లో ఊగిపోతూ…రెచ్చిపోయి మాట్లాడాడు. హిందూవులపై పవన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. తాజాగా హిందూవులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ధర్మం గురించి కనీసం అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం సబబు కాదని, సెక్యులరిజం అంటూ ఊగిపోతున్న పవన్కు కనీసం దానిపై అవగాహన లేదని రాజాసింగ్ అన్నారు. ఇంతకీ పవన్ ఏ మతానికి చెందినవారని, ఇతర మతానికి మారిపోయారా అని రాజాసింగ్ ప్రశ్నించారు. తక్షణమే హిందూవులపై పవన్ చేసిన వ్యాఖ్యలనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబడ్దార్ పవన్ అని రాజాసింగ్ హెచ్చరించారు. మొత్తంగా హిందూ మతంపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజాసింగ్ వార్నింగ్పై జనసేన అధినేత ఎలా స్పందిస్తాడో చూడాలి.
