ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. జీఎన్రావు కమిటీ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయమని చెప్పలేదని..విశాఖలో తుఫాన్లు, వరద ముప్పు, సముద్ర మట్టం పెరగడం అనే ముప్పు ఉందని, అసలు విశాఖలో రాజధాని ఏర్పాటుకు కావల్సిన ప్రభుత్వభూములు లేవని, రాజధానిగా విశాఖ సేఫ్ కాదని చెప్పిందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలతో సహా, అనుకుల మీడియా గత రెండు, మూడు రోజులుగా విశాఖపై విషం కక్కుతున్నాయి.
ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తును మార్చే రాజధాని ఏర్పాటును అడ్డుకుంటున్న చంద్రబాబుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా విశాఖపై జరుగుతున్న దుష్ప్రచారంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఫైర్ అయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలపై అదేపనిగా విషం కక్కుతున్న చంద్రబాబు వేయి పడగలు ఉన్న మహా విష సర్పమని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తుఫానులు, వరదలు వస్తాయని చంద్రబాబు నాయుడు విశాఖపట్నంపై విషప్రచారం చేస్తూ ప్రజలనుే భయభ్రాంతులను చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో ఉత్తరాంధ్ర ప్రజలపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని దాడి ధ్వజమెత్తారు. మహావిషసర్పంలాంటి చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి.. ప్రతిపక్షనాయకుడిగా చేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ఇక దమ్ముంటే మూడు రాజధానులపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి వైసీపీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్న చంద్రబాబు సవాలుపై దాడి స్పందించారు. గతంలో ఎన్టీఆర్ బోఫోర్స్ కుంభకోణానికి వ్యతిరేకంగా ఎంపీలను రాజీనామా చేయించి మెప్పు పొందారని ఈ సందర్భంగా దాడి గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అమరావతి అవసరం అనుకుంటే తమ పార్టీ ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇంకా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సీఎం అని.. దేశంలో పీఎం అని భ్రమపడుతున్నారని వీరభద్రరావు ఎద్దేవా చేశారు. మొత్తంగా విశాఖపై విషప్రచారం చేయిస్తున్న చంద్రబాబుపై దాడి వీరభద్రరావు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.