ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును వైసీపీ ప్రభుత్వం సస్సెండ్ చేసింది. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్గా వ్యవహరిస్తుందంటూ, అధికారులను కూడా వేధిస్తుందంటూ..తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు విమర్శలపై పురపాలక శాఖ మంత్రి బొత్స స్పందించారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన వాళ్లు అవినీతి చేసినా తాము చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మరో అధికారిపైనా ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందని బొత్స వెల్లడించారు. దీన్ని కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న చంద్రబాబు.. ఐటీశాఖ దర్యాప్తులపై మాత్రం నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఐటీ శాఖ దర్యాప్తులపై ఎల్లో మీడియా కూడా స్పందించడం లేదన్నారు. తప్పు చేసింది ఎవరైనా బాధ్యత వహించాల్సిందేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు. అయినా ఒక అధికారిని సస్పెన్షన్ చేస్తే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని బొత్స ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో భయపడి దొంగలా పారిపోయి ఇక్కడికి వచ్చారని చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఏబీవీ సస్పెన్షన్ వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలకు మంత్రి బొత్స తనదైన స్టైల్లో తిప్పికొట్టారు.
