మాఘపూర్ణిమ పురస్కరించుకుని పుత్తూరు కె.యన్ రోడ్డు నందు విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. తొలుత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుంచి వందలాది మంది విశ్వబ్రాహ్మణుల స్త్రీల తో కలసి క్షీర, కలశ కుండలాలతో ఊరేగింపుగా బయలుదేరి శివాలయం వరకు రోజా స్వయంగా నడిచివచ్చారు. తదనంతరం శివాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..మహిళలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి…ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అడ్డురాకుండా ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధిపథంలో నడవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి కూడా వికేంద్రీకరించబడి..అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని..రోజా అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులు ఏర్పాటు కావాలన్నదే ప్రతి ఒక్కరి ఆశ, ఆకాంక్ష అని ఆమె స్పష్టం చేశారు. మూడు రాజధానులను అడ్డుకుంటున్న చంద్రబాబునాయుడికి భగవంతుడు బుద్ధి చెప్పాలని , మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా ప్రజా బలం అందించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు.
