ఏపీలో ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్యయాత్రతో మరింతగా ముదిరిపోతోంది. ఇవాళ ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నవమోసాల పాలనంటూ…సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో పెట్టబడులు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. పింఛన్లు తొలగించారని, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని విమర్శించారు. అమరావతి అంటే జగన్కు ఎందుకంత కోపమని, ఈ పిచ్చి తుగ్లక్ నన్ను విమర్శిస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా చంద్రబాబు విమర్శలపై ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్షనేత కాదని పనికిమాలిన నేత అని ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన బుద్ధి మారడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు వస్తున్న విశేష ఆదరణను చూAసి తట్టుకోలేకే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రల పేరిట సిగ్గు లేకుండా తిరుగుతున్నారని రోజా దుయ్యబట్టారు. బాబు ప్రజా చైతన్య యాత్రను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. అంతేకాకుండా మూడు రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వారి ప్రాంతంలో తిరగనివ్వకపోగా తరిమి తరిమి కొడతారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు మినహా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం టీడీపీకి 23 సీట్లు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా ఉండవని రోజా జోస్యం చెప్పారు. మొత్తంగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మొదలైన మాటల యుద్ధంతో… ఏపీ రాజకీయాలు ఇంకా ఎండాకాలం పూర్తిగా రాకముందే కాక పుట్టిస్తున్నాయి.
