రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్డీసీ) కి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చింతలపూడి ఎత్తిపోతల పథక నిర్మాణం పూర్తి చేసేందుకు నాబార్డు ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ కు ఈరుణాన్ని నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎన్ఐడీఏ) కింద మంజూరు చేసింది. ఈ విషయాన్ని నాబార్డు ఏపీ కార్యాలయం సీజీఎం సెల్వారాజ్ వెల్లడించారు. ఈ పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలోని 15మండలాలు, కృష్ణాజిల్లాలోని 18 మండలాల్లో గల 410 గ్రామాలున్నాయని, ఈ పథకం ద్వారా 4.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ పంటలకు మూడుదశల్లో 53.50 టీఎంసీల సాగునీటి సౌకర్యం కలుగుతుందని తెలిపారు.
జల్లేరు వద్ద 14 టీఎంసీల సామర్థ్యం గల తాగునీటి రిజర్వాయర్ ద్వారా ప్రాజెక్టు గ్రామాల్లో 26 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించే అవకాశం ఉందని తెలిపారు. ఈప్రాజెక్టు మార్చి 2022 నాటికి పూర్తి కానుందన్నారు.