యస్ బ్యాంకు సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా గత టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మనీలాండరింగ్కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యస్ బ్యాంకు సంక్షోభంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు యస్ బ్యాంకును అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. రూ.1300 కోట్ల టీటీడీ నిధులను డిపాజిట్ చేయించిన బాబు భారీగా కమీషన్లు తీసుకున్నారని, అలాగే ఏపీ టూరిజం నిధులను కూడా యస్బ్యాంకుకు దోచిపెట్టారని విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్తో కలిసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. యస్ బ్యాంకు అవినీతి మూలాలు చంద్రబాబు నాయుడు దగ్గర తేలుతున్నాయని నాని ఆరోపించారు. బెజవాడ కరకట్ట మీద ఉన్న బాబు నివాసంలో యస్ బ్యాంకు ఫౌండర్ ఛైర్మన్ రాణా కపూర్ ఒకరోజు ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి నాని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ ఆర్థిక అవకతవకలు జరిగినా విజయవాడ కరకట్ట మీద అక్రమ బంగళాలో తేలుతుంది. రాణా కపూర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నది కరకట్టకు లింక్ అవుతోంది. చంద్రబాబు దోచుకున్న సొమ్ము కాంగ్రెస్ పార్టీకి హవాలా రూపంలో పంపారని తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాగే కలియుగ దైవం వెంకటేశ్వరస్వామికి చెందిన రూ.1300 కోట్లు యస్ బ్యాకులో డిపాజిట్ చేశారు. అంతేకాక ఢిల్లీలో యస్ బ్యాంక్తో కలిసి పారిశ్రామిక సదస్సు నిర్వహించారు. రాణా కపూర్తో కలిసి హవాలా వ్యాపారం చేసిన బాబు.. తన హవాలా సొమ్మును యస్ బ్యాంక్ ద్వారా విదేశాలకు మళ్లించారని, దీనిపై ఈడీ పూర్తిస్థాయిలో విచారణ జరపాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. మొత్తంగా యస్ బ్యాంక్ ఛైర్మన్ రాణాకపూర్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు హయాంలో యస్ బ్యాంకు ద్వారా జరిగిన హవాలా, మనీలాండరింగ్ వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తడం ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.