అమరావతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఈ ప్రమాద ఘటనను గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన కారులోనే ఆసుప్రతికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద మంగళవారం ఆటోను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో మానికొండకు చెందిన జి.నరసింహారావు, బండారుగూడెంకి చెందిన ఐ.రాధిక తీవ్రంగా గాయపడ్డారు. అయితే అదే సమయంలో అమరావతి లోని సెక్రటేరియట్కు తన కాన్వాయ్తో వెళుతున్న ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని..రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈ ఇరువురిని గమనించి.. వెంటనే వాహనాన్ని ఆపివేయించి..పరిస్థితిపై ఆరాతీశారు. ఇరువురు తీవ్ర గాయాలతో ఉన్నారని గ్రహించి, ఆలస్యం చేస్తే వారి ప్రాణాలకు ప్రమాదమని గ్రహించిన ఆళ్ల నాని వెంటనే తన సొంత వాహనంలో క్షతగాత్రులను ఎక్కించుకుని చినఅవుటపల్లిలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలకు తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా విధుల నిమిత్తం సెక్రటేరియట్కు వెళుతూ కూడా.. రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి, మానవత్వాన్ని చాటుకున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్లనానిని ప్రజలు అభినందిస్తున్నారు. కాగా ఆత్కూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఆళ్లనాని మానవత్వానికి బాధితులతో పాటు, ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
