టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సెప్టెంబర్ 11 న ఎస్టీ, ఎట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే..ఆ కేసులో కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించగా పోలీసులు ఆయన్ని ఏలూరు జైలుకు తరలించారు. చింతమనేని జైలుకు వెళ్లి దాదాపు రెండు నెలలు కావస్తున్నా..ఇంకా బెయిల్ దొరకలేదు..దీనికి కారణం.. చింతమనేనిపై మొత్తంగా దాదాపు 60 కు పైగా కేసులు నమోదు కావడం. ఒక కేసులో రిమాండ్ ముగియగానే..పోలీసులు మరో కేసు నమోదు చేయడం..కోర్ట్ ముందు హాజరుపర్చడం..మళ్లీ న్యాయమూర్తులు 14 రోజులు రిమాండ్ విధించడం సెప్టెంబర్ 11 నుంచి ఇదే తంతు నడుస్తోంది. దీంతో చింతమనేనికి బెయిల్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. తాజాగా చింతమనేనిపై మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. పెదపాడు, పెదవేగి, దెందులూరు పోలీస్స్టేషన్లలో చింతమనేనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మరోసారి నాలుగు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కాగా ఇవాళ పీటీ వారెంట్పై చింతమనేనిని పోలీసులు ఏలూరు జిల్లా జైలు నుంచి కోర్టులో హాజరుపర్చగా నాయ్యమూర్తి ఆయనకు మళ్లీ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అంటే నవంబర్ 20వ తేదీ వరకు చింతమనేని జైల్లో ఉండక తప్పదు. కాగా మరికొన్ని పాత కేసుల్లో కూడా కోర్టు ఈనెల 20వ తేదీ వరకు చింతమనేనికి రిమాండ్ను పొడిగించినట్లు తెలిసింది. మళ్లీ కొత్తగా నాలుగు ఎస్సీ, ఎస్టీ, ఎట్రాసిటీ కేసులు నమోదు కావడంతో మరోసారి కోర్డు రిమాండ్లు విధించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చింతమనేని ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఇదిలా ఉంటే చింతమనేనిపై ప్రతి రోజూ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. త్వరలో ఈ కేసులు వందకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని పోలీసులు అంటున్నారు.. చింతమనేనిపై మరో నాలుగు కొత్త కేసులు నమోదు అయ్యాయని తెలిసి..ప్రభాకరం కేసుల్లో సెంచరీ కొట్టేలా ఉన్నాడుగా అంటూ దెందులూరు ప్రజలు తమలోతాము చర్చించుకుంటున్నారు.
