దేశంలో నల్లధనానికి, నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకంటూ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్ ఆ తరువాత రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తేలింది. దేశంలో హల్ చల్ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని, తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తన ఏటీఎమ్లలో పెద్ద నోటు లభ్యం కాదని స్పష్టీకరించింది. ఏటీఎమ్లలో రెండు వేల నోటు నింపడం ఆపివేయాలంటూ ఇండియన్ బ్యాంకు సంబంధింత బ్రాంచ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇకమీదట తన ఏటీఎమ్లలో రెండు వేల నోటు కనిపించదని, దానికి బదులుగా రూ.200 నోటును అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. వినియోగదారుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో మార్చి 1 నుంచి ఇండియన్ బ్యాంకు ఏటీఎమ్లలో రూ.2 వేల నోటు అదృశ్యం కానుంది. కాగా ఇప్పటికే వినియోగదారులు సైతం ఏటీఎమ్లలో తీసుకుంటున్న పెద్ద నోట్లను బ్యాంకుకు వెళ్లి మార్చుకుంటున్నారు. మరోవైపు మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో వెళతాయేమోనని కొందరు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా రెండువేల నోటును రద్దు చేస్తారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఇండియన్ బ్యాంకు నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
