టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పించే ఎల్1, ఎల్2, ఎల్3 లను రద్దు చేశారు. దేవుడి ముందు అందరూ సమానమే అని ప్రకటించారు. తాజాగా తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలకు వస్తున్న వయో వృద్ధులు దర్శనం కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి, వారికి శ్రీఘ్ర దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీని కోసం రెండు సమయాలు కేటాయించినట్లు వెల్లడించారు.
1) ఉదయం 10 గంటలకు
2)సాయంత్రం 3 గంటలకు
ఫోటోతో ఉన్న వయస్సు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకుని భక్తులు ఎస్-1 కౌంటర్ వద్ద చూపించాల్సి ఉంటుంది.ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద కొండ పక్కనే మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. కూర్చోవడానికి మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయి. సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు. రూ.20కి రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. భక్తులు ఇంకా లడ్డూలు కావాలనుకుంటే రూ.25కు ఒక లడ్డూ ఎన్నైనా టోకెన్లు ఇస్తారు. కౌంటర్ నుంచి గుడికి – గుడి నుంచి కౌంటర్ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేస్తారు. వీరి దర్శనం కోసం అన్ని క్యూలైన్లు నిలిపివేయబడుతాయి. ఎటువంటి వత్తిళ్లు, తోపులాటలు లేకుండా 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో వయోవృద్ధులకు ఏడుకొండలవాడి దర్శనం ఇక కేవలం 30 నిమిషాల్లోనే జరుగుతుందని, టీటీడీ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో కోరారు.