గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. మొదటి నుంచి వల్లభనేని వంశీ రాకను వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసీపీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు రాజకీయ భవిష్యత్తుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాజాగా మంత్రులు కొడాలి నాని, పేర్నినానితో కలిసి సీఎం జగన్తో యార్లగడ్డ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యార్లగడ్డ అన్ని విధాల అండగా నిలిచారని.. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనది అని సీఎం జగన్ అన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని, భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటామని యార్లగడ్డకు సీఎం జగన్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు వల్లభనేని వంశీతో ఎలాంటి విబేధాలు లేకుండా కలిసి పని చేయాలని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్కు యార్లగడ్డకు సూచించారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు, రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం పట్ల యార్లగడ్డ వర్గంలో హర్షం వ్యక్తమవుతోంది. ఇక యార్లగడ్డకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్తో వైసీపీలోకి వంశీ చేరిక వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. సీఎం జగన్ చెప్పినట్లు వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం దాదాపుగా ఖాయమైంది. అయితే ప్రస్తుతానికి ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో వంశీ ఒక్కరే స్వతంత్రంగా కూర్చుంటారని తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే వంశీ రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా సీఎం జగన్ తో యార్లగడ్డ భేటీ అవడంతో వైసీపీలో వల్లభనేని వంశీ చేరికకు మార్గం సుగమం అయింది.