ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సతీసమేతంగా సీఎం జగన్ను కలిసిన రమేష్ దంపతులు తమ కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. ఎంపీ రమేష్ దంపతులతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడి..తప్పకుండా వివాహానికి వస్తానని చెప్పారు. కాగా రమేష్ కొడుకు రిత్విక్ ఎంగేజ్మెంట్ గత నవంబర్ నెలలో దుబాయ్లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకుగాను ఏకంగా 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 75 మంది ఎంపీలతో పాటు, వివిధ పార్టీల అగ్రనేతలు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. ఒకప్పుడు చంద్రబాబుకు సీఎం రమేష్ అత్యంత సన్నిహితుడు. టీడీపీకి ప్రధాన ఆర్థిక వనరుగా సీఎం రమేష్ వ్యవహరించేవారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత సీఎం రమేష్ క్రమంగా బాబుతో విబేధిస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ టీడీపీ చేస్తున్న వాదనను రమేష్ కొట్టిపారేశారు. వికేంద్రీకరణ అంశం రాష్ట్రం పరిధిలోనిదని..కేంద్రం జోక్యం చేసుకోదని తేల్చిచెప్పారు.. అంతే కాదు కడప జిల్లాలో వైసీపీ మంత్రులు, కీలక నేతలతో కూడా రమేష్ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన సందర్భంగా రమేష్ స్వయంగా సీఎం జగన్ను కలిసి నమస్కరించి కుశల సమాచారాలు అడిగారు. తాజాగా మరోసారి తన కొడుకు వివాహానికి ఆహ్వానిస్తూ రమేష్ రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారిపోయారు. వ్యక్తిగత కార్యక్రమమైనా…రమేష్ స్వయంగా సీఎం జగన్ను కలిసి ఆహ్వానించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. క్రమంగా రమేష్ వైసీపీకి దగ్గరవుతున్నారని బీజేపీలోని చంద్రబాబు అనుకూలవర్గం ఆరోపిస్తుంది. మొత్తంగా శాసనమండలి రద్దుతో చంద్రబాబు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో ఎంపీ రమేష్ ఏకంగా సీఎం జగన్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.