పింఛన్ ఇవ్వడం లేదని కొందరు, సంక్షేమ పథకాలు అందడం లేదని మరికొందరు.. తమపై చంద్రబాబు సర్కార్ వివక్ష కనబరుస్తోందని ఇంకొందరు ఇలా ప్రతీ ఒక్కరు వారి వారి సమస్యలను పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసి చెప్పుకుంటున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. విరవాడలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. స్థానిక సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
పింఛన్ కావాలన్నా.. ఇంటి స్థలం మంజూరు చేయాలన్నా, రుణాలు పొందాలన్నా టీడీపీలో చేరాలని, అంతేకాకుండా, తన ఫ్లెక్సీ కట్టాలంటూ తమపై ఎమ్మెల్యే వర్మ ఒత్తిడి చేస్తున్నాడని ప్రజలు జగన్తో చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వర్మ చెప్పింది చేయకపోతే ఎలాంటి సాయం అందడం లేదని జగన్కు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. విరవాడలో పక్షవాతంతో మంచం పట్టిన దొరబాబు అనే వ్యక్తిని కలిసిన వైఎస్ జగన్.. ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
సినీ నటుడు పృథ్వీ ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని వైఎస్ జగన్ వెంట అడుగులు వేశారు. అశేష జనవాహిని మధ్య వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని పృథ్వీ తెలిపారు. జగన్ అంటే నడిచొస్తున్న నమ్మకంగా ప్రజలు చెప్పుకుంటున్నారని పృథ్వీ తెలిపాడు.