ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందనే అనుమానం కలుగుతోంది. తన సొంత రాజకీయం కోసం చేస్తోన్న పనుల వల్ల ప్రజలకు కష్టాలు కలుగుతున్నాయనిపిస్తోంది. కారణం ఏపీ భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోన్న పలు కాంట్రాక్ట్ సంస్థలపై ఇటీవల కాలంలో ఐటి దాడులు జరిగాయట.. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా సదరు సంస్థలు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పనుల్లో వేగం తగ్గడం, నిలుపుదలే.. కేంద్రంలోని అధికార పెద్దలు ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఇష్టం లేక అంటే పర్సనల్ గా కాదు.. డీపీఆర్ లు ఇవ్వకపోవడం, కేంద్రం నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడంతో చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఈ కాంట్రాక్టర్లు తమ సహకరించడం లేదనే భావనతో వారిపై ఐటి దాడులు చేయించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ఏపీ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఈ దాడులు చేయించారట. కేంద్రంలోని బిజెపి నుంచి టిడిపి వైదొలిగిన తరువాత బిజెపి పెద్దలకు, టిడిపి నేతలకు దూరం బాగా పెరిగింది. బిజెపిపై టిడిపి పోరాటాలకు దిగుతూ జాతీయ స్థాయిలో ఆపార్టీని ఇబ్బంది పెడుతూ ప్రధానికి వ్యతిరేకంగా టిడిపి వ్యవహరిస్తోంది. ఈ తీరును చూసి కాంట్రాక్టర్ల వైపు నుంచి నరుక్కురావాలని ఏపీ బీజేపీ పెద్దలు ఇచ్చిన సూచనలతో దాడులు జరిగాయట.. పోలవరం పనుల్లో అక్రమాలు జరిగాయని ఏపీ బిజెపి నాయకులు మొదటినుంచి ఆరోపిస్తున్నారు. దీంతో ఆయా కాంట్రాక్టర్లను ఢిల్లీకి పిలిచి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి చెప్పాలని కోరారట.. దీంతో పెద్ద ఫైలే రెడీ అయిందట.. అలాగే ఆంధ్రాలో పనిచేస్తోన్న చాలా సాగునీటి కాంట్రాక్టర్ల కార్యాలయాలు హైదరాబాద్లోనే ఉండడంతో అక్కడ కూడా దాడులు జరిగాయని, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోనూ కీలకమైన ప్రాజెక్టులను చేస్తోన్న సంస్థలను ఐటీ అధికారులు కనీసం చూడలేదని కేవలం ఆంధ్రాలో పనులు చేస్తోన్న సంస్థలపై విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులకు దిగారని తెలుస్తోంది.