ఏపీలో గత కొద్ది రోజులుగా అన్న క్యాంటీన్లను మూసివేసారంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్లతో సహా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబు సర్కార్ రాష్ట్రమంతటా అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఈ అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అన్నక్యాంటీన్లలో జరిగిన అవినీతి బాగోతాలపై ఓ నిపుణలు కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ నిపుణల కమిటీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ‘అన్న క్యాంటీన్ల’ పేరిట భారీగా అవినీతి జరిగిందని, పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తామంటూ టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా కమీషన్లు మింగేశారంటూ ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో టీడీపీ పెద్దల దోపిడీ చూస్తే కళ్లు తేలేయడం ఖాయం. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, ముఖ్య పట్టణాల్లో 203 అన్న క్యాంటీన్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు భారీ ఎత్తున దోచేశారు. 203 క్యాంటీన్ల నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.76.22 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఏకంగా రూ.53.33 కోట్లు టీడీపీ పెద్దలు మింగేశారంటూ నిపుణుల కమిటీ నిగ్గుతేల్చింది. క్యాంటీన్ల నిర్మాణంలో రూ.35.11 కోట్లు, అందులో హంగుల పేరిట రూ.18.22 కోట్లు కాజేసినట్లు కమిటీ గుర్తించింది.
ఇక నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం.. చదరపు అడుగుకు రూ.2,100 చొప్పున రూ.17.30 లక్షలతో ఒక్కో అన్న క్యాంటీన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, టీడీపీ సర్కారు పాలనలో చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని ఏకంగా రూ.4,585కు పెంచేశారు. ఫలితంగా ఒక్కో క్యాంటీన్ నిర్మాణ వ్యయం రూ.37.55 లక్షలకు పెరిగింది. అన్ని క్యాంటీన్ల విషయంలో కేవలం నిర్మాణాల్లోనే రూ.35.11 కోట్లు అదనంగా చెల్లించారు. అలాగే షోకుల కోసం ఒక్కో క్యాంటీన్కు రూ.8.98 లక్షలు వెచ్చించారు. మొత్తం 203 క్యాంటీన్లలో హంగు, ఆర్భాటాలకు రూ.18.22 కోట్లు ఖర్చయ్యిందని లెక్కలు చూపారు. వాస్తవానికి క్యాంటీన్లలో అదనపు పనులేవీ జరగలేదని నిపుణుల కమిటీ తేల్చింది. అంటే ఈ సొమ్మంతా టీడీపీ నేతలు, అప్పటి ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే వెళ్లిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే అన్న క్యాంటీన్ల నిర్మాణానికి ఎం30 గ్రేడ్ కాంక్రీట్ పేరుతో ఒక్కో క్యాంటీన్కు రూ.7 లక్షలు, ప్లాస్టరింగ్ పేరుతో ఒక్కో క్యాంటీన్లో రూ.40 వేలు, ఫౌండేషన్, బేస్మెంట్లో ఇసుక నింపినట్లు రికార్డుల్లో చూపి, ఒక్కో క్యాంటీన్లో అదనంగా రూ.2.10 లక్షలను టీడీపీ నేతలు కొల్లగొట్టారు. ఇక అన్న క్యాంటీన్ల టెండర్లను ఎవరికి కట్టబెట్టాలో నిర్ణయించుకున్న తర్వాతే టెండర్ నిబంధనలు రూపొందించారని, ఈ టెండర్లలో పాల్గొనేందుకు అనుభవం గల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించలేదని కమిటీ స్పష్టం చేసింది. ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి చేసిన వ్యయం చాలా అధికంగా ఉందని వెల్లడించింది. వాస్తవానికి అంత ఖర్చు కాదని, ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో 70 శాతం నిధులు టీడీపీ పెద్దల జేబుల్లోకి వెళ్లినట్లు నిపుణల కమిటీ తేల్చి చెప్పింది. అన్న క్యాంటీన్లలో భారీ అవినీతి జరిగిందని తేలడంతో ఛీఛీ..పేదలకు పెట్టే అన్నంలో కూడా కక్కుర్తేనా చంద్రబాబు అంటూ ప్రజలు చీదరించుకుంటున్నారు. మొత్తంగా నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అన్న క్యాంటీన్లలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.