ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పరారీలో ఉన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవరామ్పై రెండు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ భార్గవరామ్పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. సోమవారం సాయంత్రం తన నల్లరంగు ఫార్చునర్ కారును స్వయంగా నడుపుకుంటూ వెళుతున్న భార్గవరామ్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఏపీ పోలీసుల కారును గుర్తుపట్టిన భార్గవ కారు ఆపకుండా వేగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దారి గుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. భార్గవ కారును వెంబడించిన పోలీసులు గచ్చిబౌలి ఓక్వుడ్ హోటల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించగా, కారు ఆపినట్లే ఆపి, సడన్గా స్పీచ్ పెంచి పారిపోయాడు. దీంతో ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ తమ విధులకు ఆటంకపర్చడంతో పాటు, కారుతో గుద్దే ప్రయత్నం చేశాడని భార్గవరామ్పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవరామ్ను పట్టుకునేందుకు ఆళ్లగడ్డ పోలీసులతో పాటు, గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఓటమి పాలై జిల్లాలో రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియకు భర్త పరారీ ఉదంతం మరింత తలనొప్పిగా మారింది.
