ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత ఆరోపణలకు దారితీస్తోంది. ఇంగ్లీష్మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు..నలుగురో, ఐదుగురో పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు..చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు మనవడు ఇంగ్లీష్లో చదవడం లేదా..పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష మీడియంలో చదువుకోకూడదా.. అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు..మూడు పెళ్లిళ్లు మీరు కూడా చేసుకోండి..ఎవరు వద్దన్నారు..నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీరు రెండేళ్లు జైలుకు వెళ్లారా అంటూ పవన్ సీఎం జగన్కు కౌంటర్ ఇచ్చారు. తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు..పవన్ మాటల్లో అహంకారం కనిపిస్తోంది బొత్స అన్నారు. పదే పదే జగన్ రెడ్డి అంటూ విమర్శలు చేస్తున్న పవన్ భాష సరిగా లేదని బొత్స తప్పు పట్టారు. ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శించడమే పనిగా పవన్ పెట్టుకున్నారని.. ఈ విషయంలో టీడీపీ, జనసేన దొందూ దొందేనని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో లక్ష టన్నుల ఇసుకను దోపిడీ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇసుక పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని..మంత్రి బొత్స ధ్వజమెత్తారు. మొత్తంగా ఇసుక విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
