ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా అమరావతి గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణితో కలిసి రాజధాని రైతులతో కలిసి పస్తులుండీ మరీ నిరసన తెలియజేశారు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్య కూడా అమరావతి గ్రామాల్లో పర్యటిస్తారని టీడీపీ ప్రకటించింది.
టాలీవుడ్ నుంచి అశ్వనీదత్ తప్ప..మిగతా ఎవరూ అమరావతి రైతులకు మద్దతు ఇవ్వలేదు..బాలయ్య వస్తే అమరావతి ఆందోళనలకు మరింత ఊపు వస్తుందని రాజధాని గ్రామాల రైతులు ఆశించారు. సంక్రాంతి పండుగ తర్వాత 16,17,18 వ తేదీల్లో తుళ్లూరు, మందడం, నిడమర్రు, రాయపూడి, పెనుమాక, ఉండవల్లి వంటి గ్రామాల్లో బాలయ్య పర్యటించాల్సి వుంది. అయితే తేదీలు మారినా బాలయ్య రాజధాని గ్రామాల్లో అడుగుపెట్టలేదు. బాలయ్య డుమ్మాపై టీడీపీ క్యాడర్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా ఇప్పటికే అమరావతిలో భూములు కాపాడుకోవడానికే చంద్రబాబు కుటుంబం రాజధాని రైతులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తుందని.. విమర్శలు వస్తున్న నేపథ్యంలో బాలయ్య అమరావతి గ్రామాల్లో పర్యటించడానికి వెనకడుగు వేస్తున్నాడని సమాచారం. అలాగే రాయలసీమలోని హిందూపురంకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాలయ్య అమరావతి గ్రామాల్లో పర్యటిస్తే..నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన కూడా బాలయ్యను పట్టి పీడిస్తుందని తెలుస్తోంది. అంతే కాదు ఇన్సైడర్ ట్రేడింగ్లో భాగంగా బాలయ్య వియ్యంకుడు అయిన ఎంఎస్ బీ రామారావుకు చంద్రబాబు ఏపీఐఐసీ కింద ఎకరం లక్ష రూపాయలు చొప్పున కారుచౌకగా 493 ఎకరాలు కట్టబెట్టినట్లు మంత్రి బొత్స ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో అమరావతి గ్రామాల్లో పర్యటిస్తే తన వియ్యంకుడి భూముల కోసమే పోరాడుతున్నట్లు అధికార పార్టీ విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉందని.. బాలయ్య భావిస్తున్నాడట.. అందుకే రాజధాని గ్రామాల్లో అడుగుపెట్టేందుకు బాలయ్య జంకుతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే బాలయ్య పర్యటన వాయిదా పడిందని…20 వ తేదీ నుంచి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తాడని చెబుతున్నారు. మొత్తంగా అమరావతి గ్రామాల్లో పర్యటించి ఆందోళన కార్యక్రమాల్లో ఊపు తెస్తాడని భావించిన చంద్రబాబుకు బాలయ్య ఊహించని షాక్ ఇచ్చాడు.