అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వాడీవేడిగా జరుగుతోంది. పరిపాలన వికేంద్రీకరణపై పెట్టిన బిల్లుపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుండగా స్పీకర్ కలుగజేసుకుని సమయం మించిపోతోందని, చంద్రబాబు ముగించాలని కోరారు. ఇంకా సమయం కావాలని చంద్రబాబు కోరారు.. ఈలోపు సీఎం జగన్ కలుగజేసుకుని ప్రతిపక్షనేతపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆయనకు ఇప్పటికే 50నిమిషాల సమయం ఇచ్చామని, ఇంకెంతసేపు కావాలని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 21మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే మాట్లాడారని చెప్పారు. తమకు ఉన్న 151మందిలో కేవలం 7గురు మాత్రమే మాట్లాడారన్నారు. అయినప్పటికీ ఇంకా సమయం కావాలని చంద్రబాబు అడగడం సరికాదని చెప్పారు. కొంత సమయం ఇచ్చి త్వరగా ముగించేలా చూడాలని స్పీకర్ తమ్మినేనికి సీఎంచెప్పారు. ఆతర్వాత ఎంత సమయం కావాలని అడగ్గా మరో గంట కావాలని టీడీపీ సభ్యులు కోరడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ మీ జాగీరు కాదని, ఇది అందరిదని వ్యాఖ్యానించారు.. కనీసం 30నిమిషాలైనా కావాలని చంద్రబాబు కోరగా మళ్లీ స్పీకర్ 15 నిమిషాలు సమయం ఇచ్చారు.
