తన సొంతూరు నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. నా సొంతూరులో మంత్రులు సభ ఎందుకు పెట్టారు…బుద్ధి ఉన్నవారు ఎవరైనా మా ఉరి నుంచి వైజాగ్ వెళ్లాలని అనుకుంటారా? మంత్రులకు కనీసం ఆలోచన లేదా? మా ఊరి వాళ్లు అమరాతిని దాటి వైజాగ్ వెళ్లాలని ఆలోచిస్తారా? వందశాతం అలా అనుకోరు. అలాంటప్పుడు మూడు రాజధానులకు మద్ధతుగా మా ఊరిలో వైసీపీ సభ నిర్వహిస్తే ప్రజలు ఎలా వస్తారంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు విమర్శలపై మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. మంత్రులు నారావారిపల్లె కాదు.. ఏ ప్రాంతానికి అయినా వెళతారని…కనీసం సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేని వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నారివారి పల్లెపై లేని ప్రేమ అమరావతిపై ఎందుకు పుట్టిందని సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తర్వాత అధికార, పాలనా వికేంద్రీకరణ అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల కోరిక మేరకే సీఎం జగన్ అధికార వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబు అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు ప్రచారాన్ని భుజాలపై మోసే సొంత ప్రచార సాధనాలను పెట్టుకుని ఒక అబద్ధాన్ని నిజం చేసేలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ఒక కృత్రిమ పోరాటాన్ని చంద్రబాబు తయారు చేశారని కన్నబాబు తీవ్రంగా దుయ్యబట్టారు.. మొన్నటివరకూ అమరావతి వీధుల్లో తిరిగి జోలె పట్టుకుని చంద్రబాబు చందాలు వసూలు చేశారని, ఆయన క్యారెక్టర్కు ఇది ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. అయితే జోలె పట్టుకుని సేకరించిన బంగారం, డబ్బులు ఎంత వచ్చాయో చెబితే చంద్రబాబు నిజాయితీ ఏంటో తెలుస్తుందన్నారు. ఇక మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అని కేంద్రం చేసిన ప్రకటనపై మంత్రి కన్నబాబు స్పందించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత చంద్రబాబు భంగపడ్డారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు విజన్ విశాఖలో బికినీ ప్రదర్శన చేయాలని ఎద్దేవా చేశారు.