ఏపీలో బయటపడుతున్న వరుస కుంభకోణాల్లో టీడీపీ మాజీమంత్రులు ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఈడీ కేసులు నమోదు చేయగా…ఇప్పుడు ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ మాజీమంత్రి అచ్చెంనాయుడు పీకల్లోతు కూరుకుపోగా…మరో మాజీమంత్రి పితాని కూడా చిక్కుల్లో పడనున్నారు. ప్రస్తుతం ఈఎస్ఐ స్కామ్ ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. అయితే ఈఎస్ఐ స్కామ్లో నా తప్పేం లేదని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో టెలీ హెల్త్ సర్వీసెస్కు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని తాను లేఖ రాసానని అచ్చెంనాయుడు చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎలా అమలు చేశారో.. అలాగే అమలు చేశామని.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అయితే ఈఎస్ఐ స్కామ్లో ప్రధాని మోదీని లాగడంపై ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. . కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదని అన్నారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదని విష్ణుకుమార్ రాజు అన్నారు. టీడీపీ నేతలు బాగా తినడానికి అలవాటు పడ్డారు.. అది మందులు కావచ్చు…మరేదైనా సరే అది దోచుకోవడమే అంటూ ఫైర్ అయ్యారు. ఈఎస్ఐ స్కామ్పై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి టీడీపీలోకి వందలాదిగా చేరుతున్నారంటూ మరో టీడీపీ మాజీమంత్రి గంటా చేస్తున్న ప్రచారంపై విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, ఒక వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా చేస్తున్న ప్రచారం విడ్డూరంగా ఉందని అన్నారు. . టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్ అని బీజేపీ సీనియర్ నేత తీవ్ర విమర్శలు చేశారు. మొత్తంగా మీ అవినీతి మకిలి మాకు ఎందుకు అంటిస్తారు అంటూ విష్ణుకుమార్ రాజు టీడీపీ నేతలకు గట్టిగా చురకలు అంటించారు.