ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏపీ ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జగన్ సర్కార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏబీవీ అవినీతి వ్యవహారాలు బయటపడడంతో జగన్ సర్కార్ ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ని సస్పెండ్ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన సామాజికవర్గానికే చెందిన ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించుకున్నాడు. చంద్రబాబు అండతో ఏబీవీ చెలరేగిపోయారు. గత ఐదేళ్లు ఆయన అవినీతిదందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 23 మంది వైసీపీ నేతలపై నిఘాపెట్టించి..భయపెట్టి..ప్రలోభపెట్టి వారిని టీడీపీలో చేర్పించడంలో చంద్రబాబుకు ఏబీవీ సహకరించాడని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
ఇక 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్ను ట్యాపింగ్ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావులు 2017 లోనే కుట్ర పన్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్ పరికరాలను ఏబీవీ కొనుగోలు చేయించారు. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్ను విదేశీ కంపెనీలకు లీక్ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా తనపై విధించిన సస్సెన్షన్ చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్లో ఏబీవీ పిటీషన్ దాఖలు చేశారు. కాని అక్కడ కూడా ఆయనకు చుక్కెదురు అయింది. ఏబీవీ సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది.
తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఏబీవీ అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కేంద్ర హోంశాఖ.. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడాన్ని సమర్థించింది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతిపై ఏప్రిల్ 7లోగా చార్జ్షీట్ దాఖలు చేయాలని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మొత్తం రూ. 25 కోట్ల 50 లక్షల మేర పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనీ.. వీటి వెనుక వెంకటేశ్వరరావు హస్తం ఉందని హోంశాఖ పేర్కొంది. పోలీస్శాఖ అధునీకరణ పేరుతో ఆయన అవినీతికి పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ నిర్థారించింది. కేవలం కులాభిమానంతో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం, ఆఖరకు దేశ భద్రతా రహస్యాలను పణంగా పెట్టిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఆయనపై త్వరలోనే చార్జీషీట్ వేయాలని కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఏబీవీ ఫోన్ ట్యాపింగ్ పరికరాల స్కామ్తోపాటు దేశద్రోహం కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయారు. అయితే అధికారులపై జగన్ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుల్లా కక్షసాధిస్తోందంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశాడు. కాని ఇప్పుడు ఏబీవీ అవినీతిపై చార్జీషీట్ వేయాలంటూ స్వయంగా కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయింది. ఎక్కడ తాను కూడా ఏబీవీతో పాటు ఫోన్ ట్యాపింగ్ పరికరాల స్కామ్లో ఇరుక్కుంటాననే భయం చంద్రబాబును వెంటాడుతోంది. మొత్తంగా ఏబీవీ సస్పెన్షన్పై వైసీపీ ప్రభుత్వంపై యాగీ చేసిన ఎల్లో బ్యాచ్ ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో తేలుకొట్టిన దొంగల్లా కామ్ అయిపోయింది.