వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారంతో 175 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న జగన్.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు.
అయితే, జగన్ పాదయాత్రలో భాగంగా బుధవారం ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన మురళీ కృష్ణ అనే టీడీపీ కార్యకర్త జగన్ను కలిశాడు. తాను, తన తండ్రి టీడీపీ కార్యకర్తలమని జగన్కు వివరించాడు. టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఆ పార్టీ జెండాలు కట్టామని తెలిపాడు. విద్యావంతుడినైన తనకు బతుకుదెరువు చూపిస్తామని టీడీపీ నేతలు ఆశపెట్టి మరీ తమ పార్టీ కార్యకలాపాలకు తనను వాడుకున్నారని, చివరకు చిన్న ఉద్యోగం ఇప్పించమని అడిగితే ఒక్క టీడీపీ నేత కూడా పట్టించుకోలేదని, మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం మూడు లక్షలు డిమాండ్ చేశారని, తాము కట్టే పరిస్థితిలో లేమని గమనించిన టీడీపీ నేతలు మాటలతో మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు మురళీ కృష్ణ.
సీఎం చంద్రబాబు నాయుడు కూడా నిరుద్యోగ భృతి పేరుతో ఎన్నికల సమయంలో నిరుద్యోగుల ఓట్లు దండుకున్నారని, చివరకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా తమను మోసం చేసినట్లు మురళీ కృష్ణ తన ఆవేదనను జగన్కు చెప్పుకుని బాధపడ్డాడు. వెంటనే స్పందించిన జగన్ మురళీ కృష్ణకు భరోసా ఇచ్చాడు. ధైర్యంగా ఉండాలని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని మురళీ కృష్ణకు జగన్ భరోసా కల్పించారు.