ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ మంగళవారం హస్తినకు వెళ్లనున్న సీఎం మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశమవుతారు. అయితే రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రంవద్ద పెండింగ్లోని అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ నివేదిక ఇవ్వనున్నారు. అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయడంతో పాటు రెవెన్యూలోటు భర్తీ, (కడప) వైఎస్సార్ జిల్లలో స్టీల్ ప్లాంటు, రాష్ట్రంలో ఓడరేవు ఏర్పాటు వంటి అంశాలపై మోడీతో జగన్ మాట్లాడనున్నారు. గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్ లకు తరలించడం వెనకున్న లక్ష్యాల ద్వారా రైతాంగానికి కలిగే ప్రయోజనాలను జగన్ వివరించనున్నారు. తీవ్ర వివాదాస్పదమైన పోలవరం పనుల రివర్స్ టెండర్ వల్ల ప్రజాధనం ఆదా అయ్యే విషయం, ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధానికి వివరించనున్నారు. ఈనేపథ్యంలో సీఎం సూచనల మేరకు కేంద్రప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రధానితోపాటు కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై నివేదిక ఇచ్చారు.
