టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సమాధానంగా ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఏపీ మంత్రులు చేస్తున్న పరుష వ్యాఖ్యలను టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లహభనేని వంశీతో మొదలైన విమర్శల పర్వాన్ని మంత్రి కొడాలి నాని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్లపై పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని చేస్తున్న పరుష వ్యాఖ్యలపై టీడీపీ కుతకుతలాడిపోతుంది. తాజాగా మరో మంత్రి అనిల్కుమార్ యాదవ్ కూడా తనదైన స్టైల్లో చంద్రబాబు, లోకేష్ దేవినేని ఉమాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరిగేషన్ మినిష్టర్గా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్తో దాదాపు వెయ్యి కోట్లు ఆదా అయ్యాయని మంత్రి చెప్పారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం 30 శాతం మాత్రమే జరిగితే..కానీ టీడీపీ మాత్రం 74 శాతం పూర్తయిందని అబద్ధపు ప్రచారం చేస్తుందని మంత్రి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు నిద్రపోయి..చివరి రెండేళ్లు మాత్రం పోలవరం, సోమవారం అంటూ చంద్రబాబు కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతోందని అనవసర రాద్ధాంతం చేస్తున్న దేవినేని ఉమా కళ్ళు దొబ్బాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మైండ్ దొబ్బి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. తాము అధికారం చేపట్టి ఆరు నెలలు కూడా గడవక ముందే కావాలని రచ్చ చేస్తున్నారన్నారు. టీడీపీ నేతల అబద్ధాలు విని ప్రజలు విసిగిపోయారని, అందుకే కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి పక్కన కూర్చోపెట్టారని మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తీస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సిన్మాపై కూడా అనిల్ స్పందించారు. వర్మ ట్రైలర్ చూశా .. తియ్యగుంది అని వ్యాఖ్యానించారు. కొడుకుని అలా చూసుకోలేక చంద్రబాబు బాధపడుతున్నాడని, వయస్సు కూడా పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు. కాగా చంద్రబాబు, లోకేష్ల విమర్శలకు సమాధానంగా తాము చేస్తున్న పరుష వ్యాఖ్యలపై టీడీపీ, ఎల్లోమీడియా ఎంత రాద్ధాంతం చేస్తున్నా మంత్రులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.. మాటకు మాట…విమర్శకు ప్రతివిమర్శగా తీవ్ర పదజాలంతో నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా చంద్రబాబు, లోకేష్లపై ఏపీ మంత్రులు చేస్తున్న పరుష వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
