టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్లో మాట్లాడటం తప్ప బాబు ఎక్కడా అభివృద్ధి చేయలేదని శంకుస్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య, ఉద్యోగం, ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పిస్తానని ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ టెండర్లు అన్ని టీడీపీ నాయకులకే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అమరావతిలో భాగమైన మంగళగిరిని చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదని అందుకే తన తనయుడి ఓటమికి చంద్రబాబే పరోక్షంగా కారణం అని ఎద్దేవా చేశారు. గతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు చంద్రబాబును నిలదీస్తున్నారు. టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో రాజధానిలో హడావుడి చేశారని, ప్రజలు రైతులు చంద్రబాబుకు రాజధానిలో తగిన గుణపాఠం చెప్పారని టీడీపీపై దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినాష్ చేసిన విమర్స్యలకు టీడీపీ నాయకులు కార్యకర్తలు బిత్తరపోతున్నారు.
