ఐయామ్ హర్టెడ్.. అంటూ చినబాబు అలకబూనారట.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలన్నీ రద్దు చేసుకుని ఏకాంతంగా ఉంటున్నారట.. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారట.. కారణమేమిటంటే.. మంత్రి నారాలోకేష్ ను అమరావతికే పరిమితం చేసారని తెలుస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలన్నీ వివాదాస్పదం అవుతుండటంతో ఆ పర్యటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అడ్డుకున్నారని తెలుస్తోంది. లోకేష్ తన తండ్రికి కొంత చేయూత నివ్వాలని జిల్లాల పర్యటనలను ప్రారంభిస్తే అవికాస్తా పార్టీ నేతల పంచాయతీలు తీర్చలేక సతమతమయ్యేంత వరకూ వచ్చింది. ఇతర అంశాలను పక్కనపెడితే వాస్తవానికి నారా లోకేష్ పార్టీ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. ఎప్పటినుంచో పార్టీకోసం శ్రమిస్తున్నారు.
ఇదేక్రమంలో మంత్రి అయిన లోకేశ్వారానికి మూడు రోజులు అమరావతిలో, మూడు రోజులు జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ పర్యటన వివరాలు జిల్లా పార్టీ కార్యాలయాలకు కూడా వెళ్లాయి. జిల్లాల్లో ఉండే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని కూడా నేతలకు చెప్పారు. ఈ ప్రకారమే చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో మొదట పర్యటించారు. ప్రకాశం జిల్లాలో చీరాలలో లోకేష్ ఎదుటే విభేదాలు బహిర్గతమయ్యాయి. అక్కడ పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ చీరాలలోని ఎమ్మెల్సీ పొతుల సునీతకు అండగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కు ఎమ్మెల్సీ పోతుల సునీతకు పొసగడం లేదు. అయితే చీరాల పర్యటనకు వచ్చిన లోకేష్ ఇద్దరి మధ్య విభేదాలను తొలగించకపోగా, దామచర్ల ను వెనకేసుకురావడంతో ఆమంచి హర్ట్ అయ్యి ఏకంగా పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు.
అలాగే లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన కూడా వివాదాస్పదమయింది.. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని లోకేష్ పిలుపునివ్వడం భారీ వివాదానికి దారితీసింది. అక్కడి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న టీజీ కుటుంబం నిరాశ చెందింది. టీజీ వెంకటేశ్ అయితే తెలుగుదేశం పార్టీలో కొత్త సంస్కృతికి లోకేష్ తెరతీశారని కూడా విమర్శించారు. ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానన్నారు. అప్పటినుంచి టీజీ వర్గం లోకేష్ పర్యటనకు దూరంగా ఉంది. లోకేష్ జిల్లాల పర్యటనలతో వివాదాలు తలెత్తడంతో ఆయనను కొద్దిరోజుల పాటు అమరావతిలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్లు అమరావతిలో టాక్.. లోకేష్ తండ్రికి భారం తగ్గిద్దామని జిల్లా పర్యటనలకు ప్లాన్ చేసుకుంటే అది కాస్తా పులిహోర అయిపోయిందట.. అసలు లోకేష్ పర్యటనలు వద్దని పార్టీ సీనియర్లే చంద్రబాబుకు పదేపదే వారించినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి.