బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలీప్యాడ్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను వేస్తున్నారు. అయినా వరద ఉధృతిని అవి కూడా ఆపలేకపోతున్నాయి. రివర్ ఫ్రంట్ వ్యూ భవనం, వాక్వే ఇప్పటికే నీట మునిగాయి. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముట్టుతోంది. తాజాగా వరద ముంపు నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి వీఆర్వో ప్రసాద్ నోటీసులిచ్చారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నివాసానికి నోటీసులివ్వడానికి వెళ్లిన వీఆర్వోను ఇంట్లో ఎవరు లేరంటూ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకుండా బయటనే నిలిపివేశారు. సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడిన వీఆర్వో వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని సూచించినట్లు తెలిపారు.
గతంలో కూడా వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న బాబుగారి అక్రమ నివాసానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం నన్ను ఇంటిలో ఉండకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ విమర్శలు చేసి రాజకీయం చేశారు. తాజాగా తన ఇంటిని వరద ముంచెత్తుతుందనే భయంతో కుటుంబంతో సహా హైదరాబాద్కు వెళ్లిపోయిన చంద్రబాబు.. వరద ముంపుకు గురైన తన అక్రమ నివాసం అంశాన్ని పక్కదారి పట్టించడానికి డ్రోన్ కెమెరాల విషయాన్ని తీసుకువచ్చి రాజకీయం చేశారు. అయితే కరకట్ట మీద కట్టిన అక్రమ నివాసంలో బాబుగారు ఉండడమే తప్పు..పైగా వైసీపీ ప్రభుత్వమే వరద నీటిని దారి మళ్లించి బాబుగారి ఇంటిని ముంచెత్తేలా కుట్రలు చేస్తున్నారంటూ…డ్రోన్ కెమెరాలతో బాబుగారికి భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ…అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ…తమ పరువు తీసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తానికి బాబుగారి అక్రమ నివాసానికి మరోసారి అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశం అయింది. మరి ఇప్పటికైనా బాబుగారు కళ్లు తెరిచి….కరకట్ట వదలి వేరే ఇంటిని చూసుకుంటాడో…లేక మూర్ఖంగా అదే ఇంట్లో ఉంటానంటూ మొండిపట్టు పడతారో చూడాలి.