కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఆందోళనలు క్రమేణా దక్షిణ భారతదేశంలో కూడా ఊపందుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఎంఐఎం అధినేత ఒవైసీ ఎన్సార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా నిరసన గళం ఎత్తుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. తాజాగా ఫిబ్రవరి 16న కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. అయితే ఈ సభలో మహారాష్ట్రకి చెందిన ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారీస్ పఠాన్ ఒక వర్గం ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం అన్నది అడుక్కుంటే వచ్చేది కాదని అన్నారు. మేం కేవలం 15కోట్ల మందిమే ఉన్నాం కానీ.. మీ 100కోట్లమందిపై ఆధిపత్యం చూపగలం..తేల్చుకుందామా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే పఠాన్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో.. అదే వేదికపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. కానీ పఠాన్ వ్యాఖ్యలను ఒవైసీ వారించలేదు. కాగా గతంలో ఓవైసీ సోదరుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ కూడా 15నిమిషాలు గడువిచ్చి.. పోలీసులని పక్కకి తప్పిస్తే మేమేంటో చూపిస్తామంటూ..ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసు నమోదు కాగా ఆ తరువాత అరెస్ట్, షరతులతో కూడిన బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఎంఐఎం ఎమ్మెల్యే ఒవైసీ సాక్షిగా మరోవర్గం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అవుతోంది. అయితే పఠాన్ వ్యాఖ్యలపై మహారాష్ట్రకి చెందిన బీజేపీ నేత పరిమల్ దేశ్ పాండే పుణేలోని డెక్కన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మొత్తంగా ఒవైసీ సాక్షిగా ఎంఐఎం ఎమ్మెల్యే వారీస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి.
