అంతా అనుకున్నట్లే జరిగింది. గత కొద్ది రోజులుగా ఊహించినట్లే కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా రామసుబ్బారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక టీడీపీ నేతలు వైసీపీలో చేరారు, ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీలో ఎవరికీ నమ్మకం లేదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అదే విధంగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలు నచ్చే వైసీపీలో చేరుతున్నానని రామసుబ్బారెడ్డి అన్నారు..
ఇక వైసీపీ భయపెడితేనే పార్టీ మారానంటూ చంద్రబాబు చేసిన విమర్శలను రామసుబ్బారెడ్డి తిప్పికొట్టారు. వైసీపీ భయపెడితేనే నేను పార్టీ మారానన్నది నిజం కాదన్నారు. జగన్ డైనమిక్ లీడర్.. ఏ పని అయినా చేస్తానంటే చేస్తారని కుండ బద్ధలు కొట్టారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి కట్టుబడి పని చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆదినారాయణరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేసినా వైసీపీకి 60 వేల మెజార్టీతో వచ్చిందంటే.. ప్రజల్లో వైసీపీకి ఉన్న ఆదరణే కారణమన్నారు. టీడీపీ విధానాలను గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని రామసుబ్బారెడ్డి తెలిపారు. అయితే రామసుబ్బారెడ్డిని చేర్చుకోవడం ద్వారా కడప జిల్లాలో దేవగుడి ఆదినారాయణ రెడ్డికి చెక్ పెట్టవచ్చని వైసీపీ భావిస్తోంది. కాగా రామసుబ్బారెడ్డి చేరికను వ్యతిరేకించిన జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం సర్ది చెప్పింది. రామసుబ్బారెడ్డి చేరికతో సుధీర్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా తన కుమారుడి రాజయ భవిష్యత్తు కోసమే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరుతుండడంతో టీడీపీ పరిస్థితి అయోమయంగా తయారైంది. జగన్ స్ట్రాటజీకి చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడనే చెప్పాలి.