లోకేష్ రాజకీయాలకు పనికిరాడని…చంద్రబాబు నిప్పో, తుప్పో తేలబోతుందని..వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ అంతరించిపోయే స్థితికి చేరిందని అన్నారు. ఇక తెలుగు దేశం పార్టీ మునిగిపోతున్న నావ అని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ను చంద్రబాబు కుట్రపూరితంగా దెబ్బతీయడమే కాకుండా పథకం ప్రకారం ఆయన కుటుంబసభ్యులను ఒక్కొక్కరిగా పార్టీకి దూరం చేశారని విమర్శించారు. అయితే తన కొడుకు లోకేశ్ను వారసుడిగా చేయాలనుకున్న చంద్రబాబు వ్యూహం ఫలించలేదన్నారు. లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు.
ఇక అమరావతి పేరుతో రైతులను రెచ్చగొడుతున్న చంద్రబాబు, లోకేష్లపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రాజధాని పేరుతో చంద్రబాబు లోకేష్లు భారీ దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఒక్కొక్క చదరపు అడుగుకు రూ.11 వేలు ఖర్చు పెట్టారని అంబటి ఆరోపించారు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి కి.మీ.కు రూ.42 కోట్లు ఖర్చు చేశారని.. వాటిపై విచారణ జరుగుతోందని అంబటి అన్నారు. అమరావతి భూకుంభకణంలో ఈడీ, సీఐడీ విచారణలో అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. త్వరలోనే బాబు నిప్పో, తుప్పో తేలబోతుందన్నారు. అలాగే అమరావతి కోసం రైతుల గుండెలు ఆగుతున్నాయంటూ చంద్రబాబు చేసిన విమర్శలను అంబటి తిప్పికొట్టారు. ఒక ప్రాంతంలో 45 మంది చనిపోతే దేశ స్థాయిలో పెద్ద వార్త అవుతుంది..కాని అమరావతిలో ఎవరు మరణించినా దండ వేసే నీచ స్థితికి చంద్రబాబు దిగజారిపోయారని అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా పోలవరం విషయంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలను కూడా అంబటి తిప్పికొట్టారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా ప్రధానమంత్రి మోదీనే చెప్పారని గుర్తు చేశారు. ఇక ఏబీవీ సస్పెన్షన్పై చంద్రబాబు చేసిన విమర్శలపై అంబటి స్పందిస్తూ…ఒక అవినీతి అధికారి సస్పెండ్ అయితే గగ్గోలు పెడుతున్న చంద్రబాబు..తన మాజీ పీఎస్ శ్రీనివాస్, కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు కార్యాలయాల్లో ఐదు రోజులపాటు ఐటీ సోదాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మొత్తంగా చంద్రబాబు, లోకేష్లను అంబటి రాంబాబు తనదైనస్టైల్లో పంచ్ డైలాగులతో చెడుగుడు ఆడారనే చెప్పాలి. అంబటి ప్రెస్మీట్పై నెట్జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు..ఇదేందయ్య..ఇది..ఏందిది..తండ్రీకొడుకులను అలా ఆడుకున్నావేంటీ అంబటి..అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.